Rajasthan: 'ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నా'.. పేరెంట్స్‌కు మెసేజ్ పెట్టి అదృశ్యమైన కోటా విద్యార్థి..!

  • రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు, మిస్సింగ్స్ కలకలం
  • చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థుల ఆత్మహత్యలు
  • ఈనెల 6వ తేదీన మరో విద్యార్థి అదృశ్యం
Kota Student Says Will Be Gone For 5 Years

ఇటీవ‌ల రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు, మిస్సింగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి అదృశ్యం కావ‌డం కలకలం రేపుతోంది. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్‌కు మెసేజ్‌ చేసి మరీ క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో పోలీసులు ఆ విద్యార్థి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

కోటా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాంపూర్‌లోని బమన్‌శాస్‌కు చెందిన 19 ఏళ్ల రాజేంద్ర మీనా కోటాలో మెడికల్‌ ప్రవేశ పరీక్ష నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన అతడు అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉంటున్న పీజీని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

వెళ్లిపోయేముందు రాజేంద్ర తన తండ్రి జగదీశ్‌ మీనాకు ఓ మెసేజ్ పంపించాడు. "నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతున్నాను. నా చదువును కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నా వద్ద రూ.8 వేలు ఉన్నాయి. ఫోన్‌ కూడా అమ్మేస్తున్నాను. నా వద్ద ఉన్న సిమ్‌ను కూడా తీసేస్తున్నా. అమ్మకు చెప్పండి నా గురించి బాధ‌ప‌డొద్దని. నేను ఎలాంటి అఘాయిత్యానికి పాల్ప‌డ‌ను. అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా కాల్‌ చేస్తా. ఏడాదికి ఓసారి కచ్చితంగా ఫోన్‌ చేస్తా" అని తన తండ్రి జగదీశ్‌ మీనాకు సందేశం పంపించాడు.

ఇలా కుమారుడి నుంచి వచ్చిన సందేశం చూసిన‌ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే అతడి కోసం వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగదీశ్‌ మీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, చ‌దువులో ఒత్తిడి కార‌ణంగానే విద్యార్థి ఇలా వెళ్లిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News